Andhra Pradesh: జగన్ ను సీఎం చేయడమే లక్ష్యం.. పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తా!: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు

  • ఏపీలో చంద్రబాబు పాలన బాగోలేదు
  • జగన్ వల్లే ఏపీకి మేలు జరుగుతుంది
  • వైసీపీలో చేరిన నార్నె శ్రీనివాసరావు

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఈసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్లు జూ.ఎన్టీఆర్ మామ, నార్నె సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చంద్రబాబు పాలన బాగోలేదని విమర్శించారు. జగన్ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

జగన్ ను ఏపీ సీఎం చేయడమే తన లక్ష్యమనీ, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు పదేళ్ల అనుబంధం ఉందని నార్నె శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు పార్టీకి తన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరానన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నార్నె వెల్లడించారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు. 

More Telugu News