Tollywood: ‘బిగ్ బాస్’ విజేత కౌశల్ పోస్టర్ ను చెప్పులతో కొట్టి దహనం చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!

  • పవన్ కల్యాణ్ పై కౌశల్ అనుచిత వ్యాఖ్యలు
  • ఓ టీవీ షోలో వెల్లడించిన కొందరు వ్యక్తులు
  • ఆగ్రహంతో ఊగిపోతున్న పవన్ కల్యాణ్ అభిమానులు

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో విజేత కౌశల్ పై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరోకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లాలోని రాజ్ విహార్ సెంటర్ లో కౌశల్ పోస్టర్ ను దగ్ధం చేశారు. తాను పవన్ అభిమానిని అంటూ బిగ్ బాస్ లో ఓట్లు వేయించుకున్న కౌశల్ ఇప్పుడు పవన్ కల్యాణ్ నే విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

హోటల్ లో బుకింగ్ విషయంలో పవన్ కల్యాణ్ పై కౌశల్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కొందరు వక్తలు చెప్పారు. ఫార్చ్యూన్ హోటల్ కు బదులుగా నోవాటెల్ లో రూమ్ బుక్ చేయాలని కౌశల్ చెప్పారనీ, దానికి తాము స్పందిస్తూ..‘సార్ ఈ హోటల్ కూడా బాగానే ఉంది. పవన్ కల్యాణ్ కూడా ఇక్కడే దిగుతారు’ అని చెప్పామన్నారు.

అయితే కౌశల్ వెంటనే స్పందిస్తూ..‘పవన్ కల్యాణ్ ఏమన్నా పోటుగాడా. వాడు ఫ్యార్చూన్ హోటల్ లో దిగాడని నేనూ ఇక్కడే  దిగాలా?’ అని ప్రశ్నించాడన్నారు. వెంటనే తనకు నోవాటెల్ హోటల్ లో రూమ్ బుక్ చేయాల్సిందిగా చెప్పాడన్నారు.

ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానులు కర్నూలులో కౌశల్ పోస్టర్ తో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టర్ ను చెప్పులతో కొట్టారు. చివరగా దానిని దగ్ధం చేశారు.  కాగా, ఈ వ్యవహారంపై కౌశల్ ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News