India: మా పైలెట్లు అందరూ సేఫ్.. పాకిస్థాన్ కస్టడీలో ఎవ్వరూ లేరు!: పాక్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన భారత్

  • రెండు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామన్న పాక్
  • వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో పట్టుకున్నట్లు వెల్లడి
  • పాక్ ఆరోపణలను ఖండించిన భారత్

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఐఏఎఫ్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్నామని వెల్లడించింది. ఆయన పేరు విక్రమ్ అభినందన్ అనీ, విక్రమ్ భారత వాయుసేనలో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా పాక్ విడుదల చేసింది. కాగా, భారత యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్థాన్ వాదనలను భారత్ ఖండించింది.

భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ చెరలో భారత పైలెట్లు ఎవ్వరూ లేరని స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై నిన్న భారత వాయుసేన దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Telugu News