India: మా సత్తా చూపడానికే వచ్చాం... మా భూభాగం నుంచే బాంబులేశాం: పాకిస్థాన్ వివరణ

  • ఇండియా మాదిరిగా రాత్రిపూట రాలేదు
  • పట్టపగలు వచ్చామన్న పాక్ ప్రభుత్వం
  • ప్రతీకార చర్య కాదని వివరణ

ఈ ఉదయం తమ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించినట్టు భారత్ ఆరోపించడంపై పాకిస్థాన్ స్పందించింది. తమ విమానాలు వాస్తవాధీన రేఖ వెంబడి మాత్రమే ప్రయాణించాయని, తమ భూభాగంలో ఉంటూనే బాంబులను జార విడిచామని ప్రభుత్వం తరఫున ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. స్వీయ రక్షణకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపేందుకే ఈ పని చేశామని తెలిపింది. ఇండియా మాదిరిగా తాము రాత్రిపూట రాలేదని, పట్టపగలే వచ్చామని తెలిపింది. ఇదేమీ ప్రతీకార చర్య కాదని, మిలటరీని లక్ష్యంగా చేసుకోలేదని, సామాన్యులను టార్గెట్ చేయలేదని తెలిపింది. తాము ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, పరిస్థితి ఇలా ఉండదని హెచ్చరించింది. కాగా, పాకిస్థాన్ ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు.

More Telugu News