Jaish-e-Mohammed: భారత్ విడిచిపెట్టిన తర్వాతే మసూద్ అజర్ ఉగ్రవాద సంస్థ స్థాపన.. సాయం చేసింది లాడెన్!

  • విమాన హైజాక్‌తో భారత్ నుంచి బయటపడిన మసూద్
  • నాటి నుంచి ప్రతీకారం కోసం ప్రతీక్షణం ప్రయత్నం
  • 2000వ సంవత్సరంలో జేఈఎం స్థాపన

మసూద్ అజర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఉగ్రవాది. భారత్‌లో ఎక్కడ ఏ దాడి జరిగినా  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతడి పాత్ర ఉంటుందనేది జగమెరిగిన సత్యం. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నది కూడా ఇతగాడి సంస్థ నుంచి వచ్చిన ఉగ్రవాదులే. కర్త, కర్మ, క్రియ అంతా వారే. పుల్వామా దాడికి 12 రోజుల తర్వాత 12 మిరేజ్-2000 యుద్ధ విమానాలతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతమార్చడమే కాకుండా, పాకిస్థాన్‌లో అతిపెద్ద ఉగ్రవాద శిబిరంగా ఉన్న బాలకోట్‌లోని జేషే క్యాంపును భారత విమానాలు సమూలంగా నేలమట్టం చేశాయి.

మసూద్ అజర్ భారత్ చేతికి బందీగా చిక్కి విమాన హైజాక్‌తో బయటపడిన తర్వాత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 155 మందితో నేపాల్‌ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు కాందహార్‌కు మళ్లించి భారత్ చేతిలో బందీగా ఉన్న మసూద్ అజర్‌ సహా మరికొందరిని దర్జాగా విడిపించుకెళ్లారు. జైలు నుంచి బయటపడి పాక్ చేరుకున్న మసూద్.. లష్కరే తాయిబా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ సలహా, సాయంతో 2000వ సంవత్సరంలో జైషే మహ్మద్ (జేఈఎం)ను స్థాపించాడు. నాటి నుంచి భారత్‌పై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

More Telugu News