Daggubati: రేపు వైసీపీలో చేరుతున్నాను: దగ్గుబాటి వెంకటేశ్వరరావు!

  • మాట ఇస్తే నిలబడే నేత వైఎస్ జగన్
  • నా కుమారుడితో కలిసి పార్టీలో చేరుతున్నా
  • జగన్ ను సీఎం చేసేందుకు కృషి చేస్తా: దగ్గుబాటి

మాటకు కట్టుబడి నిలిచే నేటితరం రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ ఒకరని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో బుధవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించిన ఆయన, తనతో పాటు తన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా పార్టీలో చేరనున్నారని అన్నారు.

మార్టూరులోని ఓ కల్యాణమండపంలో తన అనుచరులు, వైసీపీ నాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించిన దగ్గుబాటి, ప్రజల ఆశీస్సులతోనే మార్టూరు, పర్చూరు నియోజకవర్గాల నుంచి తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు గొట్టిపాటి భరత్‌ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ, దగ్గుబాటిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని పిలుపునిచ్చారు.

More Telugu News