Jagtial District: వధువు మెడలో మూడు ముళ్లూ పడ్డాక మొదటి భార్య ఎంటరయింది!

  • పోలీసులతో పెళ్లి మంటపానికి వచ్చిన మొదటి భార్య
  • పెళ్లి కొడుకుని బంధించిన వధువు కుటుంబ సభ్యులు
  • తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘటన

దర్జాగా ఓ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం చేశాడు. ఆ తర్వాత మళ్లీ బ్యాచిలర్‌ ముసుగు తొడుక్కున్నాడు. వివాహ ప్రయత్నం ఫలించి పెళ్లి నిశ్చయం కాగానే రెండో అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. ఆ తర్వాత మొదటి భార్య ఎంటరవ్వడంతో అసలు కథ మొదలయ్యింది. తెలంగాణలోని జగత్యాల జిల్లాలోని పోరండ్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

జిల్లాకు చెందిన రాజశేఖర్‌కు పోరండ్లకు చెందిన యువతితో ఆదివారం వైభవంగా వివాహం జరిగింది. మూడు ముళ్లుపడి కార్యక్రమం సజావుగా పూర్తికావడంతో వధువు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో పెళ్లి మంటపంలోకి ఓ యువతితో కలసి పోలీసులు ప్రవేశించారు. పెళ్లి కొడుకుకు ఇదివరకే పెళ్లయిందని, అతని మొదటి భార్యను తానంటూ ఓ యువతి ముందుకు రావడంతో కంగుతినడం వధువు కుటుంబ సభ్యుల వంతయింది.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన ఈ యువతి ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించడంతో వరుడి మోసం బయటపడింది. దీంతో ఆగ్రహించిన వధువు బంధువులు అతడిని ఓ గదిలో పెట్టి బంధించేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సదరు వరుడిని స్టేషన్ కి తీసుకెళ్లి, విచారణ చేబట్టారు. 

More Telugu News