Andhra Pradesh: వైసీపీ కార్యకర్త కామిరెడ్డి నాని ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సోదరుడు మృతి!

  • పశ్చిమగోదావరి జిల్లా వేగివాడలో ప్రమాదం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఆదిత్య
  • రాత్రంతా సోదరుడి విడుదల కోసం ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా వేగివాడలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆర్టీసీ బస్సు-ఓమ్నీ వ్యాన్‌ ఢీకొట్టుకోవడంతో కామిరెడ్డి ఆదిత్య(30) అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అదే వాహనంలో ఉన్న ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో చనిపోయిన ఆదిత్య వైసీపీ కార్యకర్త, చింతమనేని వీడియో వ్యవహారంలో అరెస్టయిన కామిరెడ్డి నానికి స్వయానా సోదరుడని తెలిసింది.

తన సోదరుడి అరెస్టుకు నిరసనగా ఆదిత్య నిన్న రాత్రంతా ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం ఉదయాన్నే కారులో వెళుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. దీంతో కామిరెడ్డి నాని ఇంటిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎడిటింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత రవి జైన్, కామిరెడ్డి నానిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News