West Bengal: మా కూతురినే ప్రేమిస్తావా.. యువకుడిని చితకబాది, సజీవదహనం చేసిన అమ్మాయి తల్లిదండ్రులు!

  • పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ లో ఘటన 
  • కూతుర్ని కలవడానికి వచ్చిన అబ్బాయి సజీవ దహనం  
  • మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు 

తమ కుమార్తెను ఓ యువకుడు ప్రేమించడంతో అమ్మాయి తల్లిదండ్రులు రెచ్చిపోయారు. యువకుడిన చావగొట్టి సజీవదహనం చేశారు. అయితే మంటలను గమనించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన రంజిత్ మొండల్(21) మిడ్నాపూర్ లో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో రంజిత్ యువతిని తరచుగా కలిసేవాడు. ఇది తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. గత శుక్రవారం యువతిని కలిసేందుకు రంజిత్ వెళ్లగా, అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అయినా కసి తీరకపోవడంతో ఊరిబయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు.

కాగా, రాత్రి పూట మంటలు రావడాన్ని గమనించిన పోలీసులు అక్కడకు వెళ్లారు. అక్కడే రంజిత్ మొబైల్ ఫోన్ లభ్యమయింది. దీంతో దీని ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News