sandra: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర

  • రైతుబంధు పథకం, పరిపాలన సంస్కరణలు బాగున్నాయి
  • ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందిస్తాం
  • సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం, పరిపాలన సంస్కరణలు, పంటలను కాపాడేందుకు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు అద్భుతంగా ఉన్నాయని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశంసించారు. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చినట్టే... ఇప్పుడు కూడా కేసీఆర్ పలు సంస్కరణలను తీసుకొచ్చారని ప్రశంసించారు.  

శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులకు ప్రత్యేక యూనివర్శిటీ నెలకొల్పాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని... దీనికి తమ సహాయ, సహకారాలు ఉంటాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు.

More Telugu News