Andhra Pradesh: అంబులెన్సులో గంజాయి స్మగ్లింగ్.. రూ.2 కోట్ల సరుకును విశాఖలో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు!

  • విశాఖపట్నంలోని సబ్బవరం మండలంలో ఘటన
  • గంజాయి స్మగ్లింగ్ పై అధికారులకు పక్కా సమాచారం
  • అంబులెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో అధికారులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. అంబులెన్సు ముగుసులో భారీఎత్తున తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సబ్బవరం మండలం సమీపంలో ఈరోజు చోటుచేసుకుంది. ఇక్కడి నాతయ్యపాలెం గ్రామం వద్ద ఓ అంబులెన్సులో గంజాయిని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు, పోలీసుల సాయంతో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ అంబులెన్సు రావడాన్ని గమనించి దాంట్లో సోదాలు నిర్వహించారు. దీంతో దాదాపు 1,813 కేజీల గంజాయి ఆ వాహనం నుంచి బయటపడింది. దీని విలువ మార్కెట్ లో రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు అంబులెన్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News