Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి వచ్చిన ఎంపీ కేశినేని నాని.. ‘విజయవాడ పశ్చిమ’ సీటుపై మొదలైన పంచాయతీ!

  • నాని వెంట ఏపీ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్
  • విజయవాడ పశ్చిమం సీటుపై చంద్రబాబుకు నివేదన
  • ఈ సీటు తమకే కావాలంటున్న జలీల్ ఖాన్ ఫ్యామిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో టికెట్ ల పంచాయతీ ఎక్కువైంది. ఈ విషయంలోనే ఇటీవల కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి గ్రూపుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సయోధ్య కుదర్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని చంద్రబాబును అమరావతిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరాను నాని తన వెంట తీసుకొచ్చారు. విజయవాడ పశ్చిమం అసెంబ్లీ టికెట్ ను నాగూర్ మీరా కోరుకుంటున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే చంద్రబాబును ఇటీవల కలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కుమార్తె షబానా ఖాతూర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందిన విజయవాడ పశ్చిమ సీటును కుమార్తెకు ఇవ్వాలన్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో షబానా మాట్లాడుతూ.. పశ్చిమ సీటుపై ఏపీ సీఎం తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ టికెట్ ను చంద్రబాబు ఎవరికి ఇస్తారన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News