Kurnool District: నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో ఏదో ఒకటి నాకు ఇవ్వాలని కోరుతున్నా: ఏవీ సుబ్బారెడ్డి

  • నంద్యాలలో నాకు బలమైన కేడర్ ఉంది
  • భూమా కుటుంబానికి రెండు సీట్లు ఉన్నాయిగా
  • అందులో ఒకటి నా కోసం త్యాగం చేయాలి

కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో ఏదో ఒకటి తనకు ఇవ్వాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కోరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గం టికెట్ ను తనకు చంద్రబాబు కేటాయిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. అక్కడ, తనకు బలమైన కేడర్ ఉందని చెప్పారు. నాడు భూమా నాగిరెడ్డి కోసం తన సీటును త్యాగం చేసి, నంద్యాల నుంచి పోటీ చేశానని అన్నారు.

భూమా కుటుంబానికి రెండు సీట్లు ఉన్నాయి కనుక అందులో ఒక సీటును తన కోసం త్యాగం చేయమని కోరుతున్నానని అన్నారు. నంద్యాల లేదా ఆళ్లగడ్డ స్థానాల్లో అధిష్ఠానం ఏది కేటాయించినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇప్పటికే సర్వేలు చేసి ఉంటారని, గెలిచే అభ్యర్థులకే టికెట్లు లభిస్తాయని, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ తాను ఆశపడటంలో తప్పు లేదని అన్నారు. కేడర్ అంతా తన వైపే ఉందని, ఈ విషయాన్ని చంద్రబాబుని కలిసి చెబుతానని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

More Telugu News