Chandrababu: మన ముందున్నది కరుడుగట్టిన నేరస్తులు: జగన్ టార్గెట్ గా చంద్రబాబు నిప్పులు!

  • వైసీపీ నేతలు అభివృద్ధి ఘాతకులు
  • వారిని నిశితంగా గమనిస్తూ ఉండాలి
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేరస్తులతో నిండిన అభివృద్ధి ఘాతకులతో పోటీ పడాల్సివుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రతి ఒక్కరూ ప్రత్యర్థుల నేరచరిత్రను గుర్తుంచుకుని, వారిని నిశితంగా గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రతిపక్షం తప్పుడు పనులను చేస్తోందని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హత్యలు, దోపిడీలు, దాడులు చేయడం ప్రత్యర్థుల సంస్కృతని, వారి ఆలోచనలే భిన్నంగా ఉంటాయని అన్నారు.

పాత వీడియోలను, ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఎన్నికల వేళ వైరల్ చేస్తున్నారని, వీడియోలను ఎడిట్ చేసి చూపిస్తున్నారని, వారి కుట్ర పూరిత చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. నేరస్తులతో పోరాడాల్సి వున్నందున క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆధిక్యం సంపాదించేందుకు దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వైసీపీ అని విమర్శించిన చంద్రబాబు, రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని, ఆపై చెరుకు పంటలను తగులబెట్టించారని ఆరోపించారు.

More Telugu News