visakhapatnam: నిబంధనలన్నీ మాకేనా...రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవా?: ఎంపీ హరిబాబు ఫైర్‌

  • ఏయూ పాలకుల తీరును తప్పుపట్టిన బీజేపీ నేత
  • మోదీ సభకు అనుమతించక పోవడంపై ఆగ్రహం
  • రైల్వే గ్రౌండ్‌లో సభ నిర్వహించనున్నట్లు ప్రకటన

‘బీజేపీకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే నిబంధనలు గుర్తుకు వస్తాయా? రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు ఏ నిబంధనలు గుర్తుకు రావా? ఇదేం పక్షపాతం?’ అంటూ విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఫైర్‌ అయ్యారు. మార్చి ఒకటవ తేదీన విశాఖ వస్తున్న ప్రధాని మోదీ సభ నిర్వహణకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం ఇచ్చేందుకు పాలకులు తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు విశాఖలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఈ నిబంధనలన్నీ ఎక్కడికి వెళ్లిపోయాయని ప్రశ్నించారు. ఏయూలో అనుమతించక పోవడంతో రైల్వే మైదానంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మోదీ సభ తర్వాత రాష్ట్రం పట్ల బీజేపీ విధానాలపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోనున్నాయని చెప్పారు. తాను ఎంపీగా ఉండగానే రైల్వేజోన్‌ సాధిస్తానని చెప్పారు. మళ్లీ తాను పోటీ చేయడంపై అధిష్ఠానందే తుదినిర్ణయమని తెలిపారు. పొత్తు విషయం కూడా అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.

More Telugu News