Vijayawada: ఆస్తి కోసం భర్తపైనే అఘాయిత్యం... వేడినీళ్లు పోయడంతో తీవ్రగాయాలు!

  • విజయవాడ అయోధ్యనగర్‌లో ఘటన
  • భర్త పేరున ఉన్న ఆస్తులు పిల్లల పేరున బదిలీ చేయాలని డిమాండ్‌
  • పట్టించుకోకపోవడంతో ఘర్షణ

ఆస్తికోసం భర్తపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిందో ఇల్లాలు. ఘర్షణ సందర్భంగా కోపాన్ని ఆపుకోలేక సలసలకాగుతున్న నీటిని అతనిపై పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడ అయోధ్యనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

అయోధ్య నగర్‌లోని అయోధ్య టవర్స్‌లో నివసిస్తున్న అట్లూరి వెంకటరమణ, హేమలతలు దంపతులు. పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ భవన నిర్మాణ పనులు చేయిస్తుంటారు. హేమలత నగర పాలక సంస్థ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వెంకటరమణ ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం లేదన్నది హేమలత ఆరోపణ. అందువల్ల ఆయన పేరున ఉన్న ఆస్తులను పిల్లల పేరున బదిలీ చేయాలని హేమలత కొన్నాళ్లుగా వెంకటరమణపై ఒత్తిడి తెస్తోంది.

ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు వెంకటరమణ పొయ్యిపై నీళ్లు పెట్టుకున్నారు. అవి సలసల కాగుతుండగా ఓ గిన్నెతో నీటిని తెచ్చిన హేమలత వెంకటరమణపై పోసింది. దీంతో అతని వీపుపై తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News