February 20 2014: నేటికి సరిగ్గా ఐదేళ్ల క్రితం... ఎంత ద్రోహం చేశారు?: చంద్రబాబు

  • 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో విభజనకు ఆమోదం
  • అదే విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
  • బీజేపీ నమ్మకద్రోహం చేసిందని విమర్శలు

ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కేంద్రం చేసిన నమ్మక ద్రోహాన్ని ఎండగడుతూ, ఐదో వార్షిక నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా జరపాలని పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ఆంధ్రులను నమ్మించి మోసం చేసి ఐదేళ్లయిందని, ప్రత్యేక హోదా సహా ఎన్నో హామీలను గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. కొత్త పరిశ్రమలకు రాయితీలను ప్రకటించలేదని పార్టీ నేతలతో వ్యాఖ్యానించిన ఆయన, ఇచ్చిన రూ. 350 కోట్లను కూడా వెనక్కు తీసుకున్నారని, అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి ఉన్న ఆర్థికలోటును భరిస్తామని చెప్పిన కేంద్రం, నాలుగో వంతును కూడా చెల్లించలేదని విమర్శించిన చంద్రబాబు, ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు ఫిబ్రవరి 20, 2014న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర విభజన బిల్లును ఫిబ్రవరి 18న లోక్ సభ, 20న రాజ్యసభ ఆమోదించాయి. 

More Telugu News