New Delhi: వాహనం ఢీకొని ఫ్లయ్ ఓవర్ పై నుంచి ఎగిరిపడ్డ యువతి... వీడియో!

  • న్యూఢిల్లీ వికాస్ పురిలో ఘటన
  • బైక్ పై వెళుతుంటే ఢీకొన్న మరో బైక్
  • స్వల్పగాయాలతో బయటపడ్డ యువతి

వేగంగా వస్తున్న వాహనం ఢీకొని ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడ్డప్పటికీ ఓ యువతి మృత్యుంజయురాలైంది. ఈ ఘటన న్యూఢిల్లీలోని వికాస్ పురిలో జరుగగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో సప్న(20) అనే యువతికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి.

తన మిత్రుడిని కలిసే నిమిత్తం మోటార్ సైకిల్‌ పై పశ్చిమ విహార్‌ నుంచి జనక్‌ పురికి ఇద్దరు స్నేహితులతో కలిసి సప్న వెళుతున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. కునాల్ అనే మిత్రుడు వాహనం నడుపుతూ ఉండగా, మధ్యలో జియో, వెనుక సప్న ఉన్నారు. వికాస్‌ పురి ఫ్లయ్ ఓవర్‌ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిల్‌ వారిని ఢీకొంటూ వేగంగా వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో కునాల్, జియో ఫ్లయ్ ఓవర్ బారియర్ ను గుద్దుకోగా, సప్న గాలిలోకి ఎగిరి కిందనున్న రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనమూ రాలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను, ఆమె మిత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News