Warangal Urban District: ప్రమోషన్ ఇస్తే.. ఐదు లక్షల లంచం ఇస్తా: నేరుగా ఉన్నతాధికారికే ఎస్సెమ్మెస్ చేసిన ఘనుడు!

  • ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఎస్సెమ్మెస్ 
  • ఆ పని చేసి పెడితే రూ.5 లక్షలు ఇస్తానని ఆఫర్
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

పదోన్నతుల పరంగా అన్యాయం జరిగిన ఇద్దరికి ప్రమోషన్ ఇస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానంటూ ఏకంగా ఉన్నతాధికారికే ఎస్సెమ్మెస్ చేశాడో ఘనుడు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిందీ ఘటన. కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న బత్తిని సత్యనారాయణ గౌడ్ ప్రజారోగ్యశాఖ సంచాలకుడు(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావుకు ఎస్సెమ్మెస్ చేస్తూ.. ఐదు లక్షల రూపాయలు ఆఫర్ చేస్తూ మంగళవారం ఏకధాటిగా ఎస్సెమ్మెస్‌లు పంపాడు.

సర్.. స్మాల్ సబ్‌మిషన్ అంటూ ఎస్సెమ్మెస్ ప్రారంభించిన సత్యనారాయణ.. మెడికల్ సోషల్ వర్కర్ (ఎంఎస్‌డబ్ల్యూ)లో పదోన్నతుల పరంగా అన్యాయం జరిగిన ఇద్దరికి చొరవ తీసుకుని ప్రమోషన్ ఇప్పించాలని, అలా చేస్తే రూ. 5 లక్షల వరకు తాను సర్దుబాటు చేస్తానని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఎవరిని నమ్మాలో తెలియక, నేరుగా మిమ్మల్నే సంప్రదిస్తున్నానంటూ ఎస్సెమ్మెస్‌లో పేర్కొన్నాడు. త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని, ఈ క్రమంలో ఎవరైనా సీనియర్లు వస్తే ప్రమోషన్ తమ వరకు రాదని వారు భయపడుతున్నారని వరుసపెట్టి ఎస్సెమ్మెస్‌లు పంపాడు.

సత్యనారాయణ ఎస్సెమ్మెస్‌ల విషయం బయటపడి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టి సస్పెండ్ చేశారు. ఇటువంటి వారిని ఎంతమాత్రమూ ఉపేక్షించేది లేదని డీహెచ్ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు.

More Telugu News