Pakistan: మొదట పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి: బాబా రాందేవ్

  • పాక్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవాలి
  • వేర్పాటు వాదులకు మద్దతివ్వాలి
  • రాందేవ్ స్పందన

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై కఠిన వైఖరి ప్రదర్శించాల్సిన సమయం ఇదేనని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. నేడు రాయ్ పూర్ లో మాట్లాడుతూ, పాకిస్థాన్ లో బలూచిస్తాన్, పాకిస్థాన్ నైరుతి భాగాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు భారత్ మద్దతు ఇవ్వాలని, తద్వారా పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలని పిలుపునిచ్చారు. బలూచిస్తాన్ లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యోధులకు భారత్ ఆర్థిక, ఆయుధ, రాజకీయ సాయం అందించాలని, బలూచిస్తాన్ కు విముక్తి కల్పించేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని అని రాందేవ్ విజ్ఞప్తి చేశారు.

అసలు ఇవన్నీ కాదు కానీ, మొదట పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేస్తే సరి అని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా 50,000 మంది సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి రోజూ బాధపడడం కంటే ఓ యుద్ధం చేస్తే మేలని అన్నారు బాబా రాందేవ్. 'ఆ యుద్ధం ఎలా ఉండాలంటే మరో 50 ఏళ్ల పాటు పాకిస్థాన్ మనవైపు చూడాలంటేనే వణికిపోవాలి' అని పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, మనదేశంలో వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ లోనూ భారత్ వేర్పాటువాదాన్ని ఎగదోయాలని సూచించారు.

More Telugu News