Biryani: చికెన్ ముక్క కోసం వివాదం.. అమ్మాయి గొంతుకోసి హత్య!

  • పూల కొనుగోలుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి
  • చికెన్ ముక్క రాలేదని అడిగిన అమ్మాయి
  • ఇద్దరి మధ్యా వాగ్వాదం

చిన్న చికెన్ ముక్క కోసం హత్య జరిగింది. చెన్నైలోని ఓ పూల మార్కెట్‌లో చికెన్ ముక్క విషయంలో జరిగిన వివాదంలో ఏకంగా గొంతుకోసి హత్య చేశాడు. తమిళనాడులోని కోయంబేడులో పెద్ద పూల మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ మార్కెట్‌కు పూల కొనుగోలు కోసం వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయి నిన్న రాత్రి ఓ హోటల్ నుంచి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని తింటుండగా.. తనకు ఒక్క చికెన్ ముక్క కూడా రాలేదని అబ్బాయిని అడిగింది.

ఈ విషయంలో జరిగిన వాగ్వాదంతో ఆగ్రహించిన అబ్బాయి తన దగ్గరున్న కత్తితో అమ్మాయి గొంతు కోశాడు. దీంతో అక్కడికక్కడే అమ్మాయి అరుస్తూ కుప్పకూలింది. అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే మరణించిన ఆమె మృతదేహాన్ని శవపరీక్షకు తరలించి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

More Telugu News