Karnataka: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

  • ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ఎమ్మెల్యే రవి కారు
  • ఇద్దరు దుర్మరణం, ఎమ్మెల్యేకు స్వల్పగాయం
  • వివరణ ఇచ్చిన కర్ణాటక బీజేపీ విభాగం

కర్ణాటకలోని తుముకూరు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎమ్మెల్యే రవికి స్వల్ప గాయమైంది. కొందరు వ్యక్తులు ఓ కారులో కొల్లూరు ఆలయాన్ని దర్శించుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు చెందిన కారును ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కునిగల్ వద్ద సదరు వాహనం ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న కారులోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయమై కర్ణాటక బీజేపీ విభాగం స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో రవి కారును నడపలేదనీ, ఆయనకు మద్యం అలవాటు కూడా లేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకూ ఎమ్మెల్యే రవి అక్కడే ఉన్నారని తెలిపింది. రవికి ఈ ప్రమాదంలో ఛాతీ భాగంలో గాయమయిందనీ, ఆయన సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్లిపోయారని పేర్కొంది. మరోవైపు రవి కారును విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News