Andhra Pradesh: దమ్ముంటే ఏపీకి వచ్చి జగన్ తో కలిసి పోటీ చేయండి!: కేసీఆర్, కేటీఆర్ లకు మంత్రి నక్కా ఆనందబాబు సవాల్

  • స్వార్థ రాజకీయాల కోసమే పార్టీలు మారుతున్నారు
  • ఏపీలో ఆయారామ్, గయారామ్ లు ఎక్కువయ్యారు
  • వైసీపీపై మండిపడ్డ ఏపీ మంత్రి

ప్రస్తుతం ఏపీలో స్వార్థ రాజకీయాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఆ నేతలంతా ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయారామ్.. గయారామ్ లు ఎక్కువయ్యారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ల కారణంగా నేతలు టీడీపీని వీడుతున్నారని ఆనందబాబు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆస్తులు పోతాయని భయపడ్డ నేతలు  ప్రస్తుతం పార్టీలు మారుతున్నారని వ్యాఖ్యానించారు. కేసుల నుండి బయటపడడానికి జగన్.. మోదీ, కేసీఆర్ లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియని జగన్, కొంగజపం చేస్తున్నారని అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే విషం కక్కే కేసీఆర్ తో జగన్ రాజకీయ కుట్రలు పన్నుతున్నాడని మంత్రి నక్కా ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్, కేటిఆర్ ఆంధ్రాకు వచ్చి జగన్ తో కలసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. 

More Telugu News