New Delhi: లిఫ్ట్ ఇస్తామంటూ తోటి ఉద్యోగినిని కారులో ఎక్కించుకుని... మత్తిచ్చి అత్యాచారం!

  • న్యూఢిల్లీలో ఘటన
  • ఎంఎన్సీలో పనిచేస్తున్న యువతి
  • లిఫ్ట్ ఇస్తామంటూ తీసుకెళ్లి అఘాయిత్యం

తమతో పాటే పనిచేస్తున్న ఓ యువతిపై కన్నేసిన ఇద్దరు మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగులు, ఆమెను నమ్మించి, కారెక్కించుకుని మత్తుమందిచ్చి, పదేపదే అత్యాచారం చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శనివారం సాయంత్రం ఆఫీసు ముగిసిన తరువాత, ఇంటికి వెళ్లేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో తారసపడి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు.

వారితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కూల్ డ్రింక్ ను ఇచ్చారు. దాన్ని తీసుకున్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని తనపై అత్యాచారం చేశారని, ఆఖరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో తనను వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించింది. ఆపై తాను ద్వారక ప్రాంతంలోని ఇంటికి చేరుకుని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చానని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News