ICj: జాదవ్ కేసును విచారిస్తుండగా, పాక్ తాత్కాలిక న్యాయమూర్తికి గుండెపోటు!

  • ఐసీజేలో తాత్కాలిక జడ్జ్ గా హుస్సేన్ గిల్లానీ
  • గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలింపు
  • హుస్సేన్ కోలుకుంటున్నారన్న వైద్యులు

పాకిస్థాన్ లో మరణశిక్ష విధించబడిన భారతీయుడు జాదవ్ ను వెంటనే ఇండియాకు పంపాలంటూ హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదిస్తున్న వేళ, పాకిస్థాన్ తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న హుస్సేన్‌ గిల్లానీకి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఐసీజేలో ఏదైనా కేసు విచారణకు వస్తే, ఆర్టికల్ 31 ప్రకారం, సంబంధిత దేశానికి చెందిన వ్యక్తి కూడా న్యాయమూర్తుల్లో ఉండాలి. ఆ దేశానికి చెందిన వ్యక్తి బెంచ్ లో లేనిపక్షంగా తాత్కాలికంగా ఓ జడ్జీని ఐసీజే ఎంపిక చేస్తుంది. జాదవ్ కేసు విచారణకు వచ్చిన వేళ, పాక్ న్యాయమూర్తి లేకపోవడంతో హుస్సేన్ ను ఐసీజే నియమించింది. దీంతో సాధారణంగా 15 మంది న్యాయమూర్తులు ఉండే ప్యానల్ లో ఈ కేసు విచారణ 16 మంది న్యాయమూర్తుల ముందు సాగుతోంది. ప్రస్తుతం ఐసీజేలో ఇండియా తరఫున దల్వీర్‌ భండారీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

More Telugu News