Jyothi: జ్యోతి హత్య కేసులో వీడుతున్న చిక్కుముడి... శశి, పవన్ అనే యువకుల అరెస్ట్!

  • వారం రోజుల క్రితం జ్యోతి హత్య
  • అమరావతి ప్రాంతంలో దారుణంగా చంపేసిన ప్రియుడు!
  • నేడు శ్రీనివాస్ డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు

దాదాపు వారం రోజుల క్రితం తన ప్రియుడితో కలిసి బైక్ పై వెళ్లిన జ్యోతి, అమరావతి టౌన్ షిప్ ప్రాంతంలో దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో చిక్కుముడులను పోలీసులు విప్పుతున్నారు. జ్యోతిని ఓ పథకం ప్రకారం శ్రీనివాసే హత్య చేయించాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, అతనికి సహకరించారని భావిస్తున్న శశి, పవన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హత్యకు వారం క్రితమే రెక్కీ నిర్వహించారని, స్టేడియం వెనుకవైపు జనసంచారం తక్కువగా ఉంటుందని, అక్కడికి జ్యోతిని తీసుకురావాలని శ్రీనివాస్ కు వీరే చెప్పారని పోలీసులు భావిస్తున్నారు.

తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకోవాలని శ్రీనివాస్ నిర్ణయానికి వచ్చాడని, జ్యోతిని కలిసే ముందు శ్రీనివాస్ సెల్ ఫోన్ నుంచి వీరిద్దరికీ కాల్స్ వెళ్లాయని స్పష్టమైనట్టు చెబుతున్నారు. నేడు శ్రీనివాస్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆ వెంటనే అదుపులోకి తీసుకుని, గంటల వ్యవధిలోనే కేసు గురించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

More Telugu News