P Ravindrababu: అనుకున్నదే జరిగింది... టీడీపీకి రాజీనామా చేసి, జగన్ ను కలిసిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు!

  • పార్టీని మారడం లేదని ఇటీవల చెప్పిన రవీంద్రబాబు
  • ఈ ఉదయం లోటస్ పాండ్ లో జగన్ తో సమావేశం
  • రోజుల వ్యవధిలో టీడీపీకి దూరమైన ఇద్దరు ఎంపీలు

తనకు టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకం ఉందని, ఆయన తనకు అన్యాయం చేయబోరని, తాను పార్టీ మారనున్నట్టు వస్తున్న వార్తలు అసత్యమని ఇటీవల చెప్పిన అమలాపురం లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత రవీంద్రబాబు, మీడియా ఊహించినట్టుగానే ఈ ఉదయం టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన, హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. నేడే ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు గడచిన రెండు రోజులుగా ఆయన అమలాపురంలో తన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ మారే విషయంలో చర్చలు సాగించారు. కాగా, వరుసగా ఎంపీలు టీడీపీకి రాజీనామా చేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రెండు రోజుల క్రితం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా అమలాపురం ఎంపీ కూడా అదే దారిలో నడవటం, మరో ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో, నేతల ఫిరాయింపులను అడ్డుకునేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం.

More Telugu News