IMG-Reliance: పాకిస్థాన్ కు షాకిచ్చిన ముఖేష్ అంబానీ... పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న ఐఎంజీ-రిలయన్స్!

  • పీఎస్ఎల్ కు ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ-రిలయన్స్
  • వాణిజ్య సంబంధాలు పెట్టుకోరాదని నిర్ణయం
  • లీగ్ కు భాగస్వామిగా తప్పుకున్నామని ప్రకటన

శ్రీనగర్ కు సమీపంలోని అవంతిపురా ప్రాంతంలో సైనికుల కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా నిరసిస్తూ, పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్)నుంచి తప్పుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఐఎంజీ - రిలయన్స్ నిర్ణయించింది. ఇప్పటివరకూ పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తక్షణం తమ నిర్ణయం అమలులోకి వచ్చినట్టని, ఇదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా తెలియజేశామని అన్నారు.

 కాగా, పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ - రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. ఇండియాలో పీఎస్ఎల్ పోటీలు 2017లో డిస్కవరీ ఛానల్ ప్రారంభించిన డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం అవుతుంటాయి. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది.

More Telugu News