Telangana: మేడ్చల్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు!

  • మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేటలో ఘటన
  • ప్రమాదం అనంతరం పరారైన డ్రైవర్
  • కేసు నమోదుచేసిన పోలీసులు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శామీర్ పేట మండలం తూంకుంట గ్రామం సమీపంలో ఓ కారు రోడ్డు పక్కనే నడిచివెళుతున్న ఆరుగురిని బలంగా ఢీకొట్టింది. కారును డ్రైవ్ చేసిన వ్యక్తి ప్రమాదం అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై శామీర్ పేట ఎస్సై రజాక్ మాట్లాడుతూ..దేవరయంజాల్,‌ మందాయపల్లి గ్రామాలకి చెందిన ఆరుగురు కూలీలు పని నిమిత్తం అలంకృత రిసార్టుకు వెళుతున్నారని తెలిపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టిందన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారన్నారు. ఈ ఘటనలో దేవరయంజాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మి(40) అక్కడికక్కడే చనిపోయిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్సై రజాక్ తెలిపారు.

More Telugu News