pakistan: ‘ఉగ్ర’ దాడి ఘటన ఎఫెక్ట్.. పాక్ క్రికెట్ బోర్డుకు షా కిచ్చిన భారత ఛానెల్ డీ స్పోర్ట్స్!

  • పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత
  • ప్రస్తుత తరుణంలో ఈ మ్యాచ్ ల ప్రసారం భావ్యం కాదు
  • అందుకే, ఈ నిర్ణయం తీసుకున్న డీ-స్పోర్ట్స్

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన ప్రభావం పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ)పై పడింది. ఈ దాడులు జరిగిన రోజే ప్రారంభమైన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను నిషేధిస్తూ భారత్ ఛానెల్ డీస్పోర్ట్స్ షాకిచ్చింది. ఈ దాడి కారణంగా యావత్తు దేశం విషాదంలో మునిగిపోయి ఉందని, ఇటువంటి సమయంలో పాక్ క్రికెట్ మ్యాచ్ లు భారత్ లో ప్రసారం చేయడం భావ్యం కాదని ఆ ఛానెల్ భావించినట్టు సమాచారం. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి, సాంకేతిక లోపం కారణంగా లీగ్ రెండో మ్యాచ్ ప్రసారం నిలిచిపోయింది. అధికారికంగా మాత్రం లీగ్ ఐదో మ్యాచ్ నుంచి ప్రసారాలు నిలిపివేసినట్టు ఛానెల్ కు సంబంధించిన అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ దాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఆల్ రౌండర్ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్థాన్ ఫొటోలను ఆ స్టేడియంలో ఉంచారు. ఆ టీమ్ లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఆ ఫొటోలను తొలగించారు.

More Telugu News