Srikakulam District: స్నానం చేయడానికి వెళ్లిన యువతి దారుణ హత్య!

  • శ్రీకాకుళం జిల్లా సోంపేట సమీపంలో ఘటన
  • రోడ్డుపై దుస్తులను చూసి అనుమానంతో వెతికిన గ్రామస్థులు
  • టవల్ తో గొంతు నులిమి యువతి హత్య

రోజూ మాదిరిగానే, స్నానం చేసేందుకు ఊరు బయట ఉన్న బావి వద్దకు వెళ్లిన యువతి, పట్టపగలు దారుణ హత్యకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల పరిధిలోని రామచంద్రాపురంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కురా మహంతి, రాధామణిల కుమార్తె కనకలత (22). మహంతి వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కనకలత, విద్యా వలంటీర్ గా పనిచేస్తోంది.

ఇక నిత్యమూ ఊరు బయట ఉన్న బావి వద్దకు వెళ్లి స్నానం చేసి రావడం కనకలత, రాధామణిలకు అలవాటు. శనివారం నాడు మాత్రం కనకలత ఒంటరిగా స్నానానికి వెళ్లి, బకెట్, దుస్తులు రహదారిపై ఉంచి, పక్కనే ఉన్న ఓ తోటలోకి బహిర్భూమి నిమిత్తం వెళ్లింది. ఆమె దుస్తులు చాలా సేపు రోడ్డుపైనే ఉండటంతో స్థానికులు తోటలోకి వెళ్లి చూడగా, ఆక్కడ కనకలత మృతదేహం లభించింది.

ఆమె మెడకు ఓ టవల్ ను గట్టిగా బిగించి హత్య చేసినట్టు కనిపించగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి పరిసరాలు గాలించారు. హత్యానేరంగా కేసును నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

More Telugu News