Andhra Pradesh: లిఫ్ట్ అడిగి కారు, ఐఫోన్ ను కొట్టేసిన యువతి.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన మాజీ కార్పొరేటర్!

  • ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • మాజీ కార్పొరేటర్ పీజీకే వర్మకు టోకరా
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

లిఫ్ట్ కావాలని ఓ యువతి అమాయకంగా అడిగింది. దీంతో కాదనలేక ఇచ్చిన పాపానికి ఫోన్ తో పాటు కారును సైతం పట్టుకెళ్లిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మాజీ కార్పొరేటర్‌ పీజీకే వర్మ కారులో గత నెల 28న బీచ్ రోడ్డు నుంచి విశాఖ నగరానికి వస్తున్నారు. అంతలోనే గాయిత్రీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద గుత్తుత్తి గౌరీ (28) అనే మహిళ లిఫ్ట్‌ అడిగడంతో, ఆయన లిఫ్ట్ ఇచ్చారు.

కొద్దిదూరం వచ్చాక ‘టీ తాగుదాం.. కారును ఆపండి’ అని చెప్పడంతో కారు దిగి టీ ఆర్డర్ ఇచ్చారు. ఇంతలోనే వర్మ వాష్ రూమ్ కు వెళ్లగా, ఆయన కారుతో పాటు ఫోన్ తీసుకున్న గౌరీ అక్కడి నుంచి పరారయింది. తన కారు, ఫోన్ తో పాటు యువతి కనిపించకపోవడంతో వర్మ పోలీసులను ఆశ్రయించారు. కారు విలువ రూ.12 లక్షలు ఉంటుందనీ, ఐఫోన్ ఖరీదు మరో రూ.లక్ష ఉంటుందని తెలిపారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. గౌరీ అల్లిపురంలో ఉంటోందనీ, అత్తారిల్లు అనకాపల్లి ప్రాంతమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె వెంకోజీపాలెం వద్ద కారులో వెళుతోందని సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు ఆమెను అరెస్ట్ చేసి కారు, ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గౌరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, ప్రస్తుతం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు.

More Telugu News