Jagan: టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై వైసీపీ నేత పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • పవన్ పావలా అయితే నీ రేటు అర్ధ రూపాయా?
  • శుక్రవారం జగన్ గుర్తుకు రావడం ఏంటి?
  • ఎన్టీఆర్ పార్టీలో మల్లెపూలు అమ్ముకునేవారు ఉండడం బాధాకరం

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ప్రముఖ కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను పావలా కల్యాణ్ అని, మల్లెపూలు నలుపుతున్నాడని యామిని ఎద్దేవా చేశారని, పవన్‌ను అలా అనే అర్హత ఆమెకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 'పవన్‌ పావలా, లోకేశ్ రెండువేలు' అంటున్న సాధినేని రేటు అర్ధ రూపాయా? అని ఆయన నిలదీశారు. ఎన్టీరామారావు పెట్టిన పార్టీలో ఇలా మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండడం బాధాకరమని పేర్కొన్న పృథ్వీ.. తాను ఓ సినీ నటుడిగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు.

ఇక శుక్రవారం రాగానే జగన్‌కు కోర్టు గుర్తుకు వస్తుందంటూ గతంలో యామిని చేసిన వ్యాఖ్యలపైనా పృథ్వీ స్పందించారు. శుక్రవారం అయితే ఓ ఆడపిల్లగా మహాలక్ష్మి గుర్తుకు రావాలని, లేదంటే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలని, కానీ జగన్‌మోహన్ రెడ్డి ఎందుకు గుర్తుకొస్తున్నారో ఆమెకే తెలియాలని అన్నారు. ఇకపై ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేసి ప్రభుత్వం ఏవైనా మంచి పనులు చేసి ఉంటే వాటి గురించి మాట్లాడాలని పృథ్వీ ఆమెకు సలహా ఇచ్చారు. 

More Telugu News