Andhra Pradesh: ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లను ఆడవాళ్లు చీపుర్లతో కొడతారు!: ఏపీ హోంమంత్రి చినరాజప్ప వార్నింగ్

  • గెలుస్తామన్న నమ్మకం ఉంటేనే పదవులకు రాజీనామా చేస్తారు
  • సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి అందుకే రాజీనామా చేశారు
  • అవంతి, ఆమంచి కాపు ద్రోహులు అయ్యారు

ఎమ్మెల్యేగా గెలుస్తామన్న నమ్మకం ఉన్నవాళ్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇప్పటికే తమ నేతలు రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారని అన్నారు. మిగతా నేతలు చేస్తారో, లేదో వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే నేతలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయాలా? వద్దా? అన్న విషయంలో పార్టీ హైకమాండ్ దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమన్న వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ ఎలా వెళ్లారని చినరాజప్ప ప్రశ్నించారు. వైసీపీలో చేరడం ద్వారా ఆమంచి, అవంతి కాపు ద్రోహులు అయ్యారని దుయ్యబట్టారు. వీరిని ఆడవాళ్లు చీపుర్లతో కొడతారని హెచ్చరించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనీ, అలాంటప్పుడు ఈ నేతలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

More Telugu News