Maharashtra: ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసిన రైల్వే ఉద్యోగి అరెస్టు

  • అమర జవాన్లకు నివాళులర్పిస్తుండగా ఘటన
  • మహారాష్ట్రలోని  పుణె జిల్లాలో సంఘటన
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసిన రైల్వే ఉద్యోగి ఒకరు కటకటాలపాలయ్యారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై మానవబాంబు దాడి ఘటనతో దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. నిన్న దేశవ్యాప్తంగా అమర జవాన్లకు సంతాపంగా ర్యాలీలు, సభలు నిర్వహించి జనం తమ నివాళులర్పించారు.

ఈ క్రమంలో మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కూడా అమరులకు కొందరు నివాళులర్పించారు. ఆ సమయంలో ఉపేంద్రకుమార్‌ బహుదూర్‌ సింగ్‌ (39) అనే రైల్వే ఉద్యోగి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పెద్ద పెట్టున అరిచాడు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు బహుదూర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టు సూచన మేరకు రిమాండ్‌కు తరలించారు.

More Telugu News