Sania Mirza: దేశం గురించి పట్టించుకోకుండా ఫ్యాషన్ ఫొటోలు పెడతావా?... సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం

  • తీవ్రస్థాయిలో విమర్శలు
  • భారతీయురాలివేనా అంటూ నిలదీత
  • నష్టనివారణ చర్యలకు దిగిన హైదరాబాదీ స్టార్

హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. గతంలోనూ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న సానియా తాజాగా పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనూ విమర్శలపాలవుతోంది. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 43 మంది జవాన్లు అమరులయ్యారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.

ఈ నేపథ్యంలో, సానియా మీర్జా శుక్రవారం నాడు తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన పోస్టు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. 'సరికొత్త డ్రెస్ వేసుకున్నాను చూడండి, డిజైన్ చేసింది వారు, మేకప్ చేసింది వీరు...' అంటూ ఓ పర్సనల్ పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దాని లింక్ ను ట్వీట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆగ్రహాన్ని చూపించారు.

దేశం మొత్తం ఉగ్రదాడికి బాధపడుతుంటే నువ్వు మాత్రం ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేస్తావా? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు నీ ఫొటోలు చూసేంత ఆసక్తి లేదు... కనీసం దాడి పట్ల చిన్న స్పందన కూడా లేకుండా ఇలా ఫొటోలు పెడతావా? అంటూ నిప్పులు కక్కారు. నీ కొత్త డ్రెస్ చూపించడానికి ఇదా సమయం... నువ్వసలు భారతీయురాలివేనా? అంటూ నిలదీశారు.

'నీ చెల్లెల్ని ప్రమోట్ చేయడానికి ఇంతకుమించిన తరుణం దొరకలేదా... యావత్ భారతదేశం కన్నీరు పెడుతుంటే నువ్వూ నీ ఫొటో షూట్ లు' అంటూ విరుచుకుపడ్డారు. అయినా సానియా ఇలాంటి దాడి జరిగితే స్పందించదు, ఎందుకంటే ఆమె పాకిస్థాన్ మహిళ... అంటూ మరో నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అయితే సానియా కొద్దిసేపటికే తన తప్పు తెలుసుకుని పుల్వామా దాడిపై తన స్పందన తెలియజేసింది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలోనే స్థానం లేదంటూ సీరియస్ గా ఓ ట్వీట్ చేసింది. అంతేకాదు, మృతవీరుల కుటుంబాలకు తన సంతాపం ప్రకటించింది.

More Telugu News