mlc: అందుకే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • శాసనమండలి కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేత
  • ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే పదవి కోరుకోవడం సరికాదు
  • సర్వేపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి కార్యదర్శి సత్యనారాయణకు తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం, టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే పదవి కోరుకోవడం సరికాదని, వేరే వారికి అవకాశం ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్న ధీమా వ్యక్తం చేశారు. తన నిర్ణయం గురించి సీఎం చంద్రబాబుకు చెబితే ‘ఆలోచించావా?’ అని అడిగారని, ‘నా రాజీనామా ఆమోదం పొందేలా చూడాలని చెప్పాను’ అని అన్నారు. ఏపీలో టీడీపీని ఓడించేందుకు కుట్రలు ఎన్ని పన్నినా, రాష్ట్రంలో తమ సంక్షేమ కార్యక్రమాలను చూసి, జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి మళ్లీ  చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు.

More Telugu News