Andhra Pradesh: నేను పార్టీ మారతానన్న వార్తలు అబద్ధం: తోట త్రిమూర్తులు

  • పార్టీ మారాల్సిన అవసరం లేదు
  • ప్రజల నిర్ణయమే నా నిర్ణయం
  • నాకు అన్ని రాజకీయపార్టీల ఆహ్వానాలు ఉన్నాయి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను పార్టీని వీడనున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రామచంద్రపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ మారాల్సిన అవసరం లేదని, తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకు తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని చెప్పారు.

ఇటీవల టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి మిత్రులని చెప్పారు. అయితే, రాజకీయాలు వేరు, స్నేహం వేరని, ఎవరి రాజకీయ భవిష్యత్ కోసం వారు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. కోటిపల్లి-నరసాపురం వంతెన నిర్మించాలనేదే తన చిరకాల వాంఛ అని, జొన్నాడ-యానాం రహదారి పూర్తి చేయాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. టీడీపీని వీడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పిన తోట త్రిమూర్తులు, తనకు అన్ని రాజకీయపార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయనడం కొసమెరుపు.  

More Telugu News