Goa: గోవా మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా కన్నుమూత

  • గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న డిసౌజా
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • గొప్ప నాయకుడిని కోల్పోయామన్న బీజేపీ

గోవా మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా (64) పనాజిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స అనంతరం ఇటీవల భారత్ వచ్చారు. డిసౌజా మృతిపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దక్షిణ గోవా ఎంపీ నరేంద్ర సావైకర్ ట్వీట్ చేశారు.

తామో గొప్ప నాయకుడిని కోల్పోయామని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి దామోదర్ నాయక్ తెలిపారు. కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నేతగా ఎదిగారని కొనియాడారు. నాయకుడంటే ఎలా ఉండాలన్న దానికి డిసౌజా ప్రత్యక్ష నిదర్శనమని, వర్ధమాన నేతలకు ఆయనో స్ఫూర్తి అని పేర్కొన్నారు.

1999లో గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన డిసౌజా ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2002, 2007, 2012, 2017లలో మపూసా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2012లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు డిసౌజా డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

More Telugu News