valentains day: హైదరాబాద్ పార్క్‌లో ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి.. తండ్రి ఫిర్యాదు!

  • వాలెంటైన్స్ డే రోజున పార్క్‌లో కనిపించిన ప్రేమ జంట
  • పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తండ్రి

వాలెంటైన్స్ డే  సందర్భంగా ఓ పార్క్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన తన కుమార్తెకు పెళ్లి చేయడంపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన తర్వాత తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తన కుమార్తె ఎక్కడుందో తెలియడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితుడు కాంతారెడ్డి జైపాల్ రెడ్డి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. జైపాల్ రెడ్డి కుమార్తె సుష్మారెడ్డి సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. గురువారం ఉదయం 7:45 గంటలకు కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పది గంటల సమయంలో కుమార్తె సుష్మకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే సమయంలో జైపాల్ రెడ్డి బంధువు నుంచి జైపాల్ రెడ్డికి ఓ వీడియో వచ్చింది. అందులో జైపాల్ బంధువు అయిన రాకేశ్‌తో ఆక్సిజన్ పార్క్‌లో సుష్మ వివాహం జరిగినట్టు ఉంది.

వీడియో చూసి నివ్వెరపోయిన జైపాల్ రెడ్డి వెంటనే ఆమె చదువుతున్న సీఎంఆర్ కాలేజీకి వెళ్లగా సుష్మ కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌కు వెళ్లగా అసలు విషయం తెలిసిందని, బంధువైన రాకేశ్‌తో సుష్మా రెడ్డి పార్క్‌లో ఉండగా వారిని ప్రేమికులుగా భావించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీహరిచారి, ఆనంద్‌లు మరికొందరితో కలిసి వారితో అసభ్యంగా ప్రవర్తించారని, అనంతరం ఇద్దరికీ పెళ్లి చేశారని జైపాల్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెళ్లిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, ఆ ఘటన తర్వాత తన కుమార్తె ఫోన్ స్విచ్ఛాప్ అయిందని, ఎక్కడుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్‌లో తమ కుమార్తెకు పెళ్లి చేసిన శ్రీహరి చారి, అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

More Telugu News