Hyderabad: కంటెయినర్‌ను తప్పించబోయి బోల్తాపడిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.. నలుగురి పరిస్థితి విషమం

  • నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ఘటన
  • ఊపిరి ఆడక ఇబ్బంది పడిన ప్రయాణికులు
  • 22 మందికి గాయాలు

కంటెయినర్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. నల్గొండ జిల్లా మేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. ఈ ఘటనలో గాయపడిన 22 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడెం సమీపంలో కంటెయినర్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటిగా ఉండడం, పొలంలోని బురదలో ప్రయాణికులు చిక్కుకుపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన 22 మందిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.  

More Telugu News