Dinesh Karthik: సింగిల్ తీయడానికి నిరాకరించి... భారత్ ఓటమికి కారణమైన దినేశ్ కార్తీక్... వారం తరువాత స్పందన!

  • చివరి టీ-20లో ఓటమి
  • ఆఖరి ఓవర్ లో పరుగుకు నిరాకరించిన దినేశ్ కార్తీక్
  • సిక్స్ కొట్టగలననే ఆనుకున్నానని వెల్లడి

గత వారంలో న్యూజిలాండ్‌ తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌ లో, సింగిల్ తీసే అవకాశమున్నా, కృనాల్ పాండ్యాకు బ్యాటింగ్ ఇవ్వకుండా, భారత ఓటమికి కారణం అయ్యాడన్న ఆరోపణలపై దినేశ్ కార్తీక్ ఇప్పుడు స్పందించాడు. కృనాల్‌ పాండ్యా భారీ షాట్లను కొట్టగలడన్న సంగతి తనకు తెలుసునని చెబుతూనే, తరువాతి బంతికి తాను సిక్స్‌ కొట్టగలనని అనుకునే సింగిల్ వద్దని చెప్పానని అన్నాడు.

 చివరి ఓవర్ లో గెలవాలంటే 16 పరుగులు అవసరమని, క్రీజులో కుదురుకుపోయిన తాను, కృనాల్ బాగా ఆడుతూ ఉన్నామని, టార్గెట్ ను చేరుకోగలమనే భావించానని అన్నాడు. సింగిల్‌ రన్ వద్దని అనుకున్న సమయంలో తరువాతి బంతికి సిక్స్ కొడతానని నిజంగా భావించానని, ఓ మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడిగా ఒత్తిడిలో ఉన్నా భారీ షాట్లు ఆడగల సత్తా తనకుందని నమ్మానని చెప్పాడు. ఇదే సమయంలో అనుకున్న షాట్ ను కొట్టలేకపోయానని, ఆటలో ఇది చాలా సహజమని చెప్పాడు. దీని గురించి మరచిపోయానని అన్నాడు. కాగా, కివీస్‌ తో జరిగిన మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్‌ సిరీస్‌ విజయాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News