cabinet: కౌలు రైతుకు ఏపీ సర్కారు మెరుగైన సేవలు: మంత్రి సోమిరెడ్డి

  • కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకంటే ఎక్కువ సాయం
  • కేంద్రం సాయం కొన్ని వర్గాలకే
  • ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్రం చేయూత

కౌలు రైతుకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ముందుందని, ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం కూడా తమతో పోటీపడలేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదని, తాము మాత్రం వారికి పెద్దపీట వేశామన్నారు.  కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించడంతో రాష్ట్రంలోని ప్రతి రైతు లాభపడతాడని తెలిపారు. కేంద్రం రైతుకు ప్రకటించిన సాయం వల్ల  కొన్ని వర్గాలకే మేలు జరుగుతుందని, అదే రాష్ట్ర ప్రభుత్వ సాయం ప్రతి రైతుకు అందుతుందని తెలిపారు. కౌలు రైతులను క్షేత్ర స్థాయిలో గుర్తించి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కేంద్రం 1080 కోట్ల రూపాయలు అందజేస్తుంటే, రాష్ట్రం 2,370 కోట్లు ఇస్తుందని చెప్పారు.

 ఈ నెలలో ప్రతి రైతుకు ఐదు వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ కేటాయింపులకు ఎటువంటి కోడ్‌ అడ్డంకులు ఉండవని, కేబినెట్‌లో ఏ నిర్ణయం తీసుకున్నామో, ఆ నిర్ణయానికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాక మరో రూ.8 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు కూడా తెలిపారు.

More Telugu News