Hyderabad: ఉప్పల్ లో హిజ్రాల బీభత్సం... ఏసీపీ నారాయణపై దాడి... ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు!

  • తొలుత బస్టాండ్ వద్ద ప్రయాణికులతో వాగ్వాదం
  • బంగారం, మొబైల్ ఫోన్స్ లాక్కున్న హిజ్రాలు
  • అక్కడికి వచ్చిన పోలీసులపైనా దాడి

ఈ ఉదయం హైదరాబాద్ లోని ఉప్పల్ బస్టాండ్ వద్ద కొందరు హిజ్రాలు బీభత్సం సృష్టించారు. బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న హిజ్రాలు, తొలుత డబ్బుకోసం డిమాండ్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. కొందరు ప్రశ్నించగా, వారిలో కోపం కట్టలు తెంచుకుని, అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. కనిపించిన ఆడవాళ్ల బంగారు గొలుసులు లాక్కున్నారు. పురుషుల మొబైల్ ఫోన్స్, మనీ పర్సులు బలవంతంగా లాగేసుకున్నారు.

ఈలోగా ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనా దాడికి దిగారు. ఉప్పల్ ఏసీపీ గాంధీ నారాయణపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో నారాయణపై దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయానక వాతావరణం ఏర్పడింది.

కొందరు హిజ్రాలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించగా, అక్కడి పూల కుండీలను ధ్వంసం చేస్తూ నానా రభసా చేశారు. అదనపు బలగాలను పిలిపించిన పోలీసులు, పలువురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయని ఈ సందర్భంగా ప్రయాణికులు వాపోయారు.

More Telugu News