Noida: కేన్సర్‌తో బాధపడుతున్న భార్య.. చికిత్స కోసం దాచుకున్న సొత్తును దొంగిలించిన భర్త

  • భార్యకు కేన్సర్ అని తెలియగానే వేధింపులు
  • జైల్లో పెట్టించిన భార్య
  • కక్ష పెంచుకుని సొంత ఇంటికే కన్నం వేసిన ప్రబుద్ధుడు

కేన్సర్‌తో బాధపడుతున్న మహిళ చికిత్స కోసం దాచుకున్న బంగారు నగలు, సొమ్మును దొంగిలించాడో భర్త. గ్రేటర్ నోయిడాలో జరిగిందీ ఘటన. 47 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం సురేంద్ర సింగ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సురేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల మహిళ కేన్సర్ బారిన పడడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఓ రోజు తనను వేధిస్తున్న భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని జైల్లో పెట్టారు. కొన్ని రోజులపాటు జైలులో ఉన్న సురేంద్ర సింగ్ ఇటీవలే విడుదలయ్యాడు.

భార్యపై కక్ష పెంచుకున్న సురేంద్ర తన సోదరుడు శైలేంద్ర, స్నేహితుడు నితిన్‌తో కలిసి సొంత ఇంటికే కన్నం వేశాడు. ఉపాధ్యాయురాలైన ఆమె విధులకు వెళ్లగానే ముగ్గురూ కలిసి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి అందినంత దోచుకున్నారు.

తన కేన్సర్ చికిత్స కోసం దాచుకున్న నెక్లెస్, ఎనిమిది బంగారు గాజులు, రెండు బంగారు చెవి రింగులు, 8 బంగారు ఉంగరాలు, 80 వెండి నాణేలు, వెండి పాత్రలు, స్కూటరు, కుమార్తె చెవి రింగులు, రూ.50 వేల నగదు అపహరించినట్టు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

తనకు కేన్సర్ ఉందని తేలిన తర్వాత భర్త తన వద్దకు వచ్చి తనకు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News