Suresh Raina: నేను ప్రమాదానికి గురయ్యానని వస్తున్న వార్తలు నా కుటుంబాన్ని కలచి వేశాయి: క్రికెటర్ సురేశ్ రైనా

  • దేవుడి దయవల్ల బాగానే ఉన్నా
  • ఇలాంటి వార్తలు పట్టించుకోకండి
  • ఆ యూట్యూబ్‌ ఛానళ్లపై ఫిర్యాదు చేశా

సోషల్ మీడియాను కొందరు తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మలచుకుంటున్నారు. సెలబ్రిటీలు అనారోగ్యం పాలైనట్టు, లేదంటే ఏకంగా మృతి చెందినట్టు ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా ఆల్ రౌండర్ సురేశ్ రైనా ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. రైనా కొంత కాలంగా క్రికెట్ ఆడకపోగా.. మీడియాలోనూ కనిపించట్లేదు. దీంతో ఈ వార్త నిజమేననుకుని ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

రైనా కుటుంబ సభ్యులు సైతం ఆయన గురించి జరుగుతున్న దుష్ప్రచారానికి కలత చెందాడు. తాజాగా రైనా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను దేవుడి దయవల్ల బాగానే ఉన్నానని పేర్కొన్నాడు. ‘‘నేను కారు ప్రమాదానికి గురయ్యానని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అసత్యం. ఇవి నా కుటుంబాన్ని, స్నేహితులను తీవ్రంగా కలచివేశాయి. ఇలాంటి వార్తలు పట్టించుకోకండి. దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. ఆ యూట్యూబ్‌ ఛానళ్లపై ఫిర్యాదు చేశా. త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు.

More Telugu News