YSRCP: ఆ నల్ల చొక్కాలను చంద్రబాబు జాగ్రత్తగా దాచుకుంటే మళ్లీ అప్పుడు పనికొస్తాయి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • బ్లాక్ షర్టుల్లో బందిపోట్లలా కనిపిస్తున్నారు
  • నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తినేశారు
  • ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోలేదు

ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి నిరసన తెలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు, ఆ నల్ల చొక్కాలను చంద్రబాబు జాగ్రత్తగా దాచుకోవాలని, ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే, చంద్రబాబు ఈ నల్ల చొక్కాలు ధరించి ప్రజలపై నిరసన తెలపొచ్చని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య  రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు! ’ అని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటాడు. కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో ‘అతి పేద్ద‘ ఉద్యోగం వదులుకొని ప్రజా ’షేవ్‘ కోసం వచ్చానని అంటాడు. నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆరోపించారు.

‘చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా కుల మీడియా మాత్రం తెగ హైరానా పడింది. బులెటిన్ల నిండా దీక్ష విజువల్సే. మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకున్నాయి. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక చానళ్లు మార్చుకున్నారు తెలుగు ప్రేక్షకులు! ’అని ఆయా చానెళ్లపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.



More Telugu News