Haribabu: వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్‌కు బీజేపీ ఎంపీ హరిబాబు ఘాటు జవాబు

  • టీడీపీ నేతలున్న విమానంలో హరిబాబు
  • టీడీపీ-బీజేపీ అనైతిక బంధానికి ఇది నిదర్శనమన్న విజయసాయి
  • విమానంలో ఎవరైనా ప్రయాణించవచ్చన్న బీజేపీ ఎంపీ

ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన టీడీపీ నేతలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు ఉండడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి దుమ్మెత్తి పోశారు. టీడీపీ-బీజేపీలు బయటకి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లోలోపల మాత్రం ప్రేమాయణం సాగిస్తున్నాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ట్వీట్ చేశారు. వీరి అనైతిక బంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీతో కటీఫ్ అంటూ, బాబు అండ్ కో ఆ పార్టీతో చాటుమాటు కాపురం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
 
విజయసాయి రెడ్డి ట్వీట్‌పై హరిబాబు స్పందించారు. విమానంలో ఏ పార్టీవారైనా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. విశాఖ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వచ్చానన్న ఆయన సహ ప్రయాణికులు ఎవరన్న విషయం తనకు అనవసరమన్నారు. విమానంలో ఏ పార్టీకి చెందినవారైనా ప్రయాణించవచ్చని, ఈ విషయంలో ఎటువంటి నిషేధం లేదని విజయసాయిరెడ్డికి చురక అంటించారు.

More Telugu News