Andhra Pradesh: మంగళగిరిలో దారుణం.. ప్రియుడ్ని కొట్టి యువతిపై గ్యాంగ్ రేప్.. యువతి మృతి

  • ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి
  • యువతిపై సామూహిక అత్యాచారం
  • యువకుడి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడిచేసిన దుండగులు యువకుడిని కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ప్రతిఘటించిన ఆమెపైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాస్ (26), అంగడి జ్యోతి (24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో రాత్రి  9 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు ఇనుప రాడ్లతో ప్రియుడు శ్రీనివాస్‌పై దాడి చేశారు. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రతిఘటించిన యువతిపైనా దుండగులు దాడిచేయడంతో తీవ్ర గాయాలపాలైంది.

రక్తపుమడుగులో పడి ఉన్న జంటను చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా, యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News