Andhra Pradesh: 100 రోజుల్లో అవినీతిపరులను జైలులో పెడతామన్నారుగా.. మరి జగన్ బయటెందుకు తిరుగుతున్నారు?: నారా లోకేశ్

  • మోదీకి ఏపీ మంత్రి సూటి ప్రశ్న
  • కాంగ్రెస్ ఏపీకి హోదా ఇస్తామని చెప్పింది
  • ఇంకో 75 రోజుల్లో మోదీ ఇంటికేనన్న లోకేశ్

ఇంకో 75 రోజుల్లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని తెలిపారు. నిన్న జరిగిన బీజేపీ గుంటూరు సభ కోసం వైసీపీ-బీజేపీ జెండాలున్న ఆటోలతో ప్రజలను తరలించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో లోకేశ్ మాట్లాడారు.

మోదీ సభను సక్సెస్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైసీపీ పెద్దలు కార్యకర్తలకు చెప్పారని లోకేశ్ ఆరోపించారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ప్లెక్సీలు కూడా వేశారని విమర్శించారు. మోదీ ఏపీకి వచ్చి 24 గంటలైనా జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అవినీతి పరులను 100 రోజుల్లో జైలులో పెడతానని మోదీ చెప్పారనీ, కానీ ఇంకా జగన్ బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.

జడ్జీలను మార్చి జగన్ కేసుల విచారణను మొదటికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానిని నిలదీసే హక్కును వినియోగించుకున్నామని వ్యాఖ్యానించారు. మోదీ సభలకు ఇబ్బంది వస్తే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 

More Telugu News